తెలుగు సాంప్రదాయం - ఆశ్చర్య పరచే విషయం - సంక్రాంతి

ఈ పుట ఏవిధంగా మొదలు పెట్టాలో అని దాదాపు రెండు రోజులు తల పగిలేలా ఆలోచించా. చివరకి ఏమీ తోచక, ఇదిగో ఇలా. ఇంతకీ చెప్పొచ్చిన విషయమేమిటంటే.. సంక్రాంతి రోజుల గురించి.

తెలుగు పంచాంగం ప్రకారం నా పుట్టిన రోజు ప్రతీ ఆంగ్ల సంవత్సరంలో ఒకే రోజు రాదు. ఎందుకంటే తిధులు, నక్షిత్రాలు, అన్నీ ఒకే రోజు రావు అనేది మన అందరికీ తెలిసిన విషయమే. అంతేకాకుండా, తెలుగు సంవత్సర కాలానికి ఆంగ్ల సంవత్సర కాలానికి చాలా తేడా ఉంది. ఆంగ్ల కొలమానం మన తెలుగు కొలమానానికి చాలా తేడా ఉందన్న విషయం జగద్విదితం. అందువల్ల మన ఆంగ్ల పుట్టిన తారీఖులను తెలుగు తిధులతో పోల్చుకోరాదు. ఏమంటారు?

కానీ ఒక్క విషయం మీరు అందరూ గమనించాల్సిన విషయం ఉంది. అన్నీ పండుగలూ ఒక తారీఖునే ఖచ్చితంగా రావు. కానీ ఒక్క సంక్రాంతి మాత్రం ఖచ్చితంగా జనవరి మాసం 14 / 15 / 16 తారీకులలోనే వస్తుంది. ఎందుకంటారు? ఈ కాలాన్ని ఉత్తరాయణ మరియు దక్షిణాయణ కాలాలు మారే కాలంగా పిలుస్తుంటాం. ఆంగ్ల కొలమానం ప్రకారం ప్రతి రోజులో కొంత కాలం మిగిలిపోతుంది. దాన్ని సరిగ్గా లెక్క వేయడం చేతగాక, వారు ప్రతీ రోజూ మిగిలి పోయిన కాలాన్ని విడిగా పెట్టి, నాలుగు సంవత్సరాలకి ఒక సారి లీపు సంవత్సరంగా లెక్కవేసి, ఫిబ్రవరి మాసంలో ఒక రోజు ఎక్కువ జేసి లెక్కలు సరిగానే ఉన్నాయని పిస్తున్నారు. మరి మన తెలుగు సంవత్సరం లో అధిక మాసమనీ, శూన్య మాసమనీ ఎవో ఎవో లెక్కలు వేస్తారు కదా.. ఎన్ని వేసినా అన్ని పండుగలు ఎందుకు రోజులు మారుతాయి? సంక్రాంతి మాత్రం అదే రోజు ఎందుకు వస్తుందో నాకు అర్దమవని విషయం.

ఈ జగతిలో ఎందరో అతిరధులు, సారధులు, మహారధులు.. మరెందరో మహానుభావులు .. ఎవ్వరైనా ఈ విషయాన్ని వివరించ మని మనవి.

-------------------------------------------
వినదగు నెవ్వరు జెప్పినన్ - వినినంతనే వేగిర పడక వివరింప దగున్
కనికల్ల నిజము దెలిసిన - మనుజుడే పో నీతిపరుడు మహిలో సుమతి

హక్కు దారులు దొరికారు.. మూల రచయత వివరాలు

ఈ మధ్య నేను ప్రచురించిన ’కధే.. మరచిపోలేకపోతున్నామూడు భాగాల కధ యొక్క మూల రచయత దొరికారు. ఎదో కష్ట పడి నాదైన శైలిలో పెద్ద పొడిచేసా అనుకుంటుండగా, ఈ కధని ఆంద్రజ్యోతిలో నాకన్నా ముందుగా కొల్లూరి సోమ శంకర్ గారు పెరుగన్నం పేరుతో తెలుగులోకి అనువదించారు. ఈ కధ జులై16 వ తారీఖు 2006 వ సంవత్సరంలో అనువాద కధగా ప్రచురిత మయ్యింది. ఈ కధకి మూల రచయత గా మధురై వాస్తవ్యులైన శ్రీధరన్ రంగస్వామి గారిని కొల్లూరి సోమ శంకర్ గారు పేర్కొన్నారు. ’ఆనంద వికటన్’ అనే టైటిల్‍తో మొదటి సారిగా శ్రీధరన్ రంగ స్వామిగారు రచించితే, దాని ఆంగ్ల అనువాదాన్ని 'The Promise' అనే టైటిల్‍తో మొదటి సారిగా 2003 వ సంవత్సరంలో జులై 27వ తారీఖున, బెంగళూరు ప్రాంత పత్రికైన Deccan Herald వారు, ఆ నాటి ఆదివారం అనుభందంలో ప్రచురించారని తెలియ జేసారు.

పైన పేర్కొన్న అంశాలు అన్నీ మీకు ఇండస్‍లేడీస్ వారి వెబ్ సైటు నుంచి చదువుకోవచ్చు. ఈ వైబ్ సైటులోని ఒక చర్చావేదికలో మూలకధను, The Promise గా వారి నిర్వాహకాధికారి, ’శక్తి’ గారు ప్రచురించారు. ఇచ్చట శ్రీధర్ గారు, ’వరలొట్టి’ అనే చిరునామాతో చేసిన వ్యాఖ్యలు కూడా చదవ వచ్చు. బహుశా శ్రీధరన్ రంగ స్వామిగారు నేను ఇలా రెండవ సారి తెలుగులోకి అనువాదించానని అనుకుంటారనుకుంటా. కాబట్టి తమిళం మరియు ఆంగ్లంలో రచించిన శ్రీధరన్ గారికి అంతే కాకుండా తెలుగులోకి మొదటి సారిగా అనువదించిన కొల్లూరి సోమ శంకర్ గారికి నా బ్లాగు ముఖంగా విన్న వించుకోదలచిన దేమిటంటే..

అయ్యా.. విఙ్ఞులారా.. నేను ప్రచురించే నాటికి ఈ కధ మూలాలు తెలియ నందున, శ్రీధరన్ గారి మూల కధకు నా సొంత పైత్యాన్ని చేర్చి తెలుగులో (మరోసారి) నాదైన శైలిలో కూర్చడమైనది. ఈ మొత్తం జరిగిన సమయంలో తమరిని ఎమైనా నొప్పించినట్లైతే, పెద్ద మనసుతో క్షమించమని మనవి. వీటి మీద సర్వ హక్కులు తమవే.

ఎదో కొద్దిగా నా బుర్రకు తోచినట్లుగా, కొంచం మసాళా చేర్చడం మినహా, మొత్తం కధా కధనం పైన పేర్కొన్న వారివే. అన్యధా మంచిగా తలుస్తారని ఆశిస్తాను.

-------------------------------------------
వినదగు నెవ్వరు జెప్పినన్ - వినినంతనే వేగిర పడక వివరింప దగున్
కనికల్ల నిజము దెలిసిన - మనుజుడే పో నీతిపరుడు మహిలో సుమతి

తెలుగువాళ్ళూ .. ఎక్కడ .. తమరెక్కడ??

ఈ మధ్య నేను మొదలు పెట్టిన పరిశోధనా అంశం, ’తెలుగు బ్లాగులు చదివే (తెలుగు)వారు ఏ ఏ ప్రదేసాలలో ఉన్నారు’. ఇక్కడ చదివేవారు అని మీరు అర్దం చేసుకోవాలి, చదివే ప్రతీవారూ తెలుగువారు అవుతారా లేదా అన్నది నా పీత బుర్రకి అందని విషయం. ఎందుకంటే, ఈ రోజుల్లో మిశ్రమ భాషా తల్లి తండ్రులు ఉన్నతరం మనది. తల్లిగారిది తెలుగైతే, తండ్రి గారిదేమో తమిళం. అలాగే ఇదే తంతు అటుదిటుగా అవ్వనూ వచ్చు. అందుకని, ఎవ్వరు ఏభాషా కోవిదులైనా, నావరకూ మాత్రం వారు తెలుగు ప్రచురణలు చదవగలిగారా లేదా అన్నది మాత్రమే.

ప్రస్తుత విషయానికొస్తే, నేను బ్లాగు ప్రపంచంలో ఇంకా చిన్న వాడినే. కానీ బ్లాగు చదివే ప్రపంచంలో మాత్రం పెద్దవాడిని కాకపోయినా, చిన్న వాడిని మాత్రం కాదు. ఎడా పెడా ఏది పడితే అది చదివేస్తూ ఉంటాను.. చదివిన ప్రతీదీ అర్దమవ్వాలన్న రూల్ ఏమీ లేదు కదా. అట్లాగే, చాలా చదువుతూ ఉంటాను, చాలా చాలా మరచి పోతుంటాను. కాబట్టి, చదివిన ప్రతీ విషయం గుర్తు పెట్టుకోవాలా వద్దా అనే విషయాన్ని ఆలోచించకుండా, నా మది ఇష్టానికే వదిలేస్తా.. కావాలని గుర్తు పెట్టుకోను. అలాగే కావాలని మరచిపోనూ.

నాలాగే, ఎంత మంది బ్లాగులు చదువుతున్నారో అన్న ఆలోచన రాక ముందు, నా బ్లాగును ఎంత మంది చదువుతున్నారా అన్న కుతూహలం కలిగింది. అంతే.. అన్నదే తడవుగా, ఉచిత బ్లాగు కౌంటర్ల వెంట పడ్డా. ఇష్టమొచ్చిన వాటన్నీంటినీ నా బ్లాగుకు తగిలించేసా. తగిలించిందే తడవుగా, వాటి పని అవి చేసుకోవడం మొదలు పెట్టాయి. ఇంత వరకూ బాగానే జరిగింది. ఈ మధ్యనే నా బ్లాగు వెయ్యి సార్లు కొట్టించు కొంది. ఈ సహస్ర హిట్ల ప్రయాణం గురించి నేను గమనించే లోపుల, కూడలి పిచ్చా పాటిలో ఎవ్వరో ధన్యవాదాలు తెలియజేసారు. ఇదీ ఆనందించ వలసిన విషయమే. కానీ.. ప్రతీ నాణానికీ రెండు వైపులున్నట్లుగా, నా వెయ్యి హిట్ల ప్రవహసానికీ నెగెటివ్ ఆలోచనను ఆకట్టారు సదురు ఓ బ్లాగరు. మన బ్లాగుకి మనమే హిట్లు కొట్టి, మనమే చంకలు కొట్టించు కోవడం హాస్యాస్పదం అన్నారు.

ఇదిగో ఇక్కడ నాకు కాలింది. (ఎక్కడ అని ఎదురు ప్రశ్న వేయ్యకండీ.. అలాగే.. బర్నాల్ రాయక పోయ్యారా .. అంటూ అగ్నికి ఆజ్యం పొయ్యకండి) నా బ్లాగుని నేను ఎన్ని సార్లు హిట్ చేసానా అన్న పరిశోధనలో చాలా చాలా విషయాలు వెలుగులోకి తొంగి చూసాయి. వాటిల్లో ముఖ్యమైనది, నన్ను భాధ పెట్టినదీ ఏమిటంటే.. విసిగించకుండా, అస్సలు విషయంలోకొద్దాం.

నా పరిశోధన నాబ్లాగుకు మాత్రమే కాకుండా, సదురు తెలుగు బ్లాగులన్నింటికు వర్తిస్తుందని నా అభిప్రాయం, నా బ్లాగు చదివే పరదేసీయులూ మీరేమంటారు. మీ మీ బ్లాగులు ఎవ్వరెవ్వరు.. ఏ ఏ ప్రదేశాలలో నుంచి చదువుతున్నరో తెలియజేయ గలరు.

ఎక్కువగా, తెలుగు బ్లాగులు చదివేవారిని విభజన ప్రాతీయ పరంగా చూస్తే, భారతదేశ చదువరులే ఎక్కువ భాగాన్ని కొట్టేస్తారు. కానీ అమెరికాలో ఉన్న భారతీయులలో తెలుగు తెలిసీ.. చదివే పరిఙ్ఞానం కలిగిన వారితో మన భారతీయులను పోలిస్తే, తెలరికన్లు (తెలుగు + అమరికన్ = తెలరికన్లు) చాలా తక్కువ శాతంగా మనం గమనించవచ్చు. అట్టి తెలరికన్లు, దాదాపు మన భారత చదువరిలతో బాహా బహి పోటీకి దిగారు. మొత్తంగా వారుకూడా పట్టు బిగించి, మన స్వంత గడ్డను మరచి పోలేదన్నట్లుగా మనవారితో పోటీ పడుతున్నారు. అట్టి వీరందరూ కూడా, బ్లాగు లోకంలోకి ప్రవేశించినట్లైతే, అహా .. బ్లాగు ప్రపంచం మూడు పుటలు ఆరు చదువరులుగా వెలుగొందుతుంది.

image

కానీ ఆశ్చర్యపరచిన విషయమేమిటంటే.. కెనడాలో కూడా చాలా మంది తెలుగు వాళ్ళు వున్నా, గల్ఫ్ ‍లో ఉన్న తెలుగు వారికన్నా, తక్కువగా బ్లాగులు చదువు తున్నారన్న విషయం మింగుడు పడటం లేదు. ఇక్కడ ముఖ్యంగా percentage ని మాత్రమే లెక్కగా తీసుకో బడింది, అంతే కానీ అసలైన సంఖ్యలు ఎక్కువగా ఉండవచ్చు.

అన్నింటికన్నా కలవర పరచిన విషయ మేమిటంటే.. నార్త్ అమెరికా దేశాలైన బ్రజిల్, అర్జంటీనా, పెరూ, చిలీ, వెనుజ్యువెలా వంటి ప్రదేశాలలో మన తెలుగు వారు ఉన్నపటికీ, వారు నామ మాత్రంగానైనా తెలుగు వెలుగులను చూస్తున్నారా అని అనుమానమేస్తోంది. వీరికి తోడుగా, ఆఫ్రికా దేశాలలోని తెలుగు వారు మాత్రం మేము తెలుగు మర్చిపోయామన్న లెక్కలోకి వచ్చేసినట్లున్నారు. ఇక చైనా, జపాన్, రష్యా, కజకిస్తాన్, మంగోలియా వంటి దేశ తెలుగు వారిని మనం తెలుగువారు అని అనక్కరలేదేమో!!! అన్నింటికీ మించి ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే.. ఫిన్‍లాండ్, నార్వే, ఐస్‍లాండ్, గ్రీన్‍లాండ్ లాంటి ప్రదేశాలలో నుంచి కూడా చదువరులు హిట్లు ఇస్తున్నారన్న విషయమే గొంతులో మింగుడు పడలేనటువంటి వెల్లక్కాయ మాదిరిగా ఉంది. ఏది ఏమైనా ఈ సర్వే నాకు చాలా విషయాలు తెలియ జేసింది.

మిగిలిన దేశాలలో ఉన్న తెలుగు వారూఊఊఊఊఊఊఊ .. ఎక్కడున్నారు?? దయచేయండీ.. చదవండి, స్పందించండి, తర్కించండి, తిట్టండి, కొట్టండి(నన్ననుకునేరు.. నన్ను కాదు.. బ్లాగు లింకులను). మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియజేయండి.


-------------------------------------------
వినదగు నెవ్వరు జెప్పినన్ - వినినంతనే వేగిర పడక వివరింప దగున్

కనికల్ల నిజము దెలిసిన - మనుజుడే పో నీతిపరుడు మహిలో సుమతి

మంచి - చెడు.. ఎలా అర్దం చేసుకోవాలి?

ఈ మధ్య నాలో రేగుతున్న కొన్ని మానసిక అలజడులలో ఒకటి, పైన చెప్పిన అంశం. అస్సలు మంచి అంటే ఏమిటి? దేన్ని చెడుగా తలుచుకోవాలి? ఎవ్వరు చేసిన పనులు మంచి పనులు? ఎవ్వరు చేసేవి చెడువి? అస్సలు .. మంచి చెడు అనేటటువంటివి ఎవ్వరైనా ఒక వ్యక్తికి సంభందించినవా లేక వాటికంటూ కొన్ని గుణ గణాలున్నాయా?

ఎవ్వరిని చూసి మనం మంచి వాళ్ళు అని చెప్పచ్చు? ఎవ్వరిని చెడ్డవాళ్ళనవచ్చు? వలబోజు జ్యోతిగారు ఉదహరించినట్లు, రాముడిని ఏవిధంగా మంచి వాడిగా అనుకోవాలీ? జ్యోతిగారి ప్రచురణకు స్పందించిన తాడేపల్లి లలితా సుబ్రహ్మణ్యం గారు తెలియజేసినట్లు, ఎకాలంలో వాళ్ళని ఆ యా కాలాలనుగుణంగా మాత్రమే మనం చర్చించు కోవాలి కానీ, వివిధ కాలాలలో చర్చించ కూడదన్నట్లు, మంచి చెడులు కాలాను గుణాలా?

జ్యోతిగారు ప్రచురించిన, ’పురాణాలు ఏం చెబుతున్నాయి’ పుట ఏప్రియల్ 25వ తారీఖునైతే.. నేను ఏప్రియల్ 10వ తారీఖున, ’ఎల్ వీ ప్రసాదు గారి పై నా అభిప్రాయా’న్ని ప్రచురించాను. ఇది చదివిన తరువాత, మా అమ్మకీ నాకు జరిగిన సంభాషణలోని కొన్ని ముఖ్యాంశాలు కూడా నన్ను కలవర పెట్టాయి. అమ్మ వాదనకి నేను మూగ వాడినై పోయా. రామాయణం లోని కొన్ని ఘటనలను జ్యోతిగారు ఉదాహరణగా తీసుకుంటే, అదే రామాయణం లోని మరికొన్ని విషయాలను అమ్మ ఉదహరించింది.

మొదటగా: కుశ లవులు రామనామ జపం చేసుకుంటూ అయోధ్య చేరుకుంటే, దాని వెనుక ఆంతర్యమేమిటి? దీనికి నాదగ్గరున్న సమాధానమేమిటంటే.. (నాదగ్గరే కాకుండా ఎంతో మంది లవకుశ సినిమా చూసే ఉంటారు) పిల్లలిద్దరికీ ఇక తండ్రి అవసరం ఆసన్నమైంది. ఇంక సీతా అమ్మవారి పాత్ర ఇక్కడితో ముగించేయ్యాలి కాబట్టి. మా అమ్మ వేసిన ఒకే ఒక ప్రశ్నేమిటంటే.. పసి పిల్లలను ఒంటరిగా వదిలేసి తాను మాత్రం తన తల్లి దగ్గరకు పోవచ్చా.. ఈ పిల్లలకు మాత్రం తల్లి అక్కరలేదా.. తల్లికొక న్యాయం .. పిల్లల కొక న్యాయం.. ఎంత విచిత్రం.. ఇది ఏవిధంగా న్యాయం. ఇట్టి విషయాన్ని మనం మంచి విషయంగా తలంచుకోవాలా.. లేక తల్లులకొక న్యాయం, పిల్లలకొక న్యాయంగా వ్యవహరించడాన్ని ఆయుగ మంచి, ఈ యుగ చెడుగా తలంచుకోవాలా??

రెండవది: మగవాళ్ళెప్పుడూ శాసించడమేనా.. అర్దం చేసుకునే పని లేదా? నువ్వు నిప్పుల్లోకి దూకు అనగానే సీతా అమ్మవారు, దూకేయ్యాలా!!!! ఎంతటి నిరంకుశత్వం. ఏం నేనెందుకు దూకాలీ, ఉరూ పేరూ లేని ఒక అనామకుడు నిందవేయ్యగానే భార్య శీలాన్ని శంకించాలా? అదే సీతా అమ్మ వారు, నీ శీలం సంగతేమిటని ప్రశ్నించి ఉంటే ఎలా ఉండేది. ఇది జరగలేదు, సరే.. అస్సలు ఎదైనా చెప్పే ముందు మనం పాటించాలి అని అంటారు కదా. మరి శ్రీరాములు వారు ఎందుకు అగ్ని ప్రవేశం చెయ్యలేదు? తాను పాటించి నిరూపించుకున్న తరువాత అడిగి ఉంటే బాగుండును కదా?

ఇలా .. ఎన్నో.. మరెన్నో.. ఎమో!! ఇలాంటి వాటిని అర్దం చేసుకునేంత బుర్ర నాకు ఆ దేవుడు ప్రసాదించ లేదు. వీటన్నింటినీ ఆలోచించిన తరువాత, నాకు ఒక్క ముక్క అర్దం మయ్యింది.

మంచి చెడు అనేటటువంటివి, ప్రతీ వ్యక్తి ఇష్టాయిష్టాలే తప్ప మరొకటి కాదని. మనకి ఇష్ట మయితే అది మంచిది, మనకు కష్టమయ్యి అయిష్టమయితే అది చెడ్డది. That's it, very simple.

Good and Bad are nothing but Like and Dislike

అబ్బా చికాకేస్తోంది - జల్సా పాటలు

సినిమా పాటలంటే పదికాలాల పాటు వినడానికి సొంపుగా ఉండాలి, అంతె కానీ కొత్తల్లో కొత్తగా, పాతబడె కొద్దీ చత్తగా ఉంటే, జల్సా పాటల లాగే ఉంటాయి. ఈ మధ్య విడుదలైన జల్సా చిత్రం ఎన్ని చిత్ర-విచిత్రాలు చేసిందో మీకందరికీ తెలిసే ఉంటుంది. నేను ఆ సినిమా ఇంకా చూడలేదు కానీ, చాలా మంది వ్రాసిన రివ్యూలు పుల్లుగా వారి వారి బ్లాగులలో చదవడమైనది. ఏమో, నేను స్వతహాగా సినిమాలు తక్కువగా చూస్తా కాబట్టి, ఆ సినిమా గురించి వ్యాఖ్యానించే అనుభవం లేదనుకోవచ్చు. ఇక అస్సలు విషయానికొస్తే.. అదేనండీ జల్సా పాటల విషయానికి వస్తే..

నాకు తెలిసినంత వరకూ రేండు రేడియే స్టేషన్ వాళ్ళు ఈ పాటల ప్రసార హక్కులు మాకే సొంతమంటే, మాకే సొంతం అన్న రీతిలో యడా పెడా వాయించేస్తున్నారు. ఇంతకీ ఎవ్వరు అధికారిక ( అఫీషియల్ పార్ట్‍‍నర్స్) హక్కుదారులో ఆ సినిమా వాళ్ళకే తెలియాలి. మీకేమైనా తెలుసా. తెలిస్తే, మరచి పోకుండా చెప్పండీ. చెప్పారనుకోండి మీకో పెద్ద -- పెడతా.

రోజూ ఆఫీస్‍కు వచ్చేటప్పుడు, తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు, నా నోకియా 3310 లోని రేడియో వింటూ హైదరాబాదు ట్రాఫిక్ భాధల నుంచి ఉపశమనం పొందుతూ ఉంటాను. జల్సా విడుదలవ్వడానికి ముందు రెండు రోజుల నుంచి ఈ రోజు వరకూ ’పాడిందే పాటరా పాత పళ్ళ దోసరా..’ అంటూ అరిగి పోయిన గ్రామ పంచాయితీ రేడియోల్లో పందుల పెంపకం గురించి పాత రోజుల్లో వినిపించిన సొదలా.. ఏ కార్యక్రమానికి పడితే ఆ కార్యక్రమానికి.. జల్సా పాటలతో సంభందం ఉన్నా లేకపోయినా.. ఈ రేడియో జాకీలకి పిచ్చి పట్టినట్లు ఎన్ని సార్లు వినిపిస్తారో తెలియదు. పొద్దున్నుంచి సాయంత్రం దాకా వేసిందే వేసి, చికాకు పెట్టేస్తునారనుకోండి.

వీళ భాధ భరించలేక, ఫోన్ హేడ్‍సెట్ కాస్తా తీసేసి, చక్కగా నా మ్యూజిక్ ప్లేయర్‍ని బయటకు తీసా. ఆఫీస్‍కు వచ్చే వేళ్ళల్లో ఎదైనా కాల్ కనుక మిస్ అయితే, ఆఫీస్‍కు చేరుకున్నాకో లేక ఇంటికి చేరుకున్నాకో వాళకి తిరిగి మిస్ కాల్ చేస్తే, అవసరమైన వాళ్ళు రిటర్న్ కాల్ చేస్తారు. లేకపోతే లేదు. కానీ ఈ జల్సా పాటలు, మొదట్లో బాగానే ఉన్నాయి, ఎందుకో ఇప్పుడిప్పుడే వెగటు పుడుతున్నాయి. కానీ ఎదో పద్యంలో చెప్పినట్లు..

అనగ అనగ రాగ మతిశయిల్లుచుండు
తినగ తినగ వేము తియ్యనుండు
సాధనమున పనులు సమకూరు ధరలోన
విస్వధా అభిరామ వినురవేమ

వినగా వినగా పాటలు వినసొంపవ్వాలి.. అలాగే తినగా తినగా.. వేప కాయలు కూడా తియ్యగా అవ్వాలి, ఏమిటో మరి నాకు ఈ పాటలు వినగా.. వినగా.. చెవులు తుప్పు పడుతున్నాయి. ఎవ్వరైనా పాటలు వింటే తుప్పు వదిలిందంటారు. ఏంటో కొత్తగా నాకు తుప్పు పడుతోంది. ఏమి చేతురా లింగా .. ఏమీ చేతురా..

 
Clicky Web Analytics